2022-23 బేస్ ఇయర్గా ఉండే కొత్త జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) సిరీస్లో ఈ-వాహన్, వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) డేటాతో పాటు వంటవాళ్లు, డ్రైవర్లు, పనిమనుషులు అందించే ఇంటి పనులకు సంబంధించిన సేవల గణాంకాలు మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన వివరణ ప్రకారం, కాలక్రమేణా ఎకానమీలో చోటు చేసుకున్న మార్పులను ప్రతిబింబించేలా బేస్ ఇయర్ని ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తారు. అయితే కోవిడ్ పరిణామాలు, జీఎస్టీ అమలు తదితర అంశాల కారణంగా కొన్నాళ్లుగా మార్చలేదు. ప్రస్తుతం 2011-12గా ఉన్న బేస్ ఇయర్ని 2022-23కి మారుస్తున్నారు.
కార్మిక శక్తి సర్వే, కంపెనీల చట్టం కింద నమోదు చేసుకోని సంస్థలపై నిర్వహించే అధ్యయనాలను ఈ గణాంకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, రహదారి రవాణా సర్వీసులకు సంబంధించి ప్రైవేట్ వినియోగ వ్యయాలను అంచనా వేసేందుకు ఈ-వాహన్ పోర్టల్ డేటాను ఉపయోగిస్తారు. జీడీపీలో రాష్ట్రాలవారీగా ప్రైవేట్ కంపెనీల వాటాను అంచనా వేసేందుకు జీఎస్టీ డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్–డిసెంబర్ 2025) సంబంధించి కొత్త సిరీస్ ప్రాతిపదికగా ఉండే జీడీపీ డేటాను శుక్రవారం (నేడు) విడుదల చేస్తారు.


