ఊరట : మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు | Government Working On Next Stimulus Package | Sakshi
Sakshi News home page

ఊరట : మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు

Oct 21 2020 4:43 PM | Updated on Oct 21 2020 4:44 PM

Government Working On Next Stimulus Package - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు చేస్తోంది. కోవిడ్‌-19 నేపథ్యంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఐదు నెలల కిందట ఆత్మనిర్భర్‌ పేరుతో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

వృద్ధిని వేగవంతం చేసి ఆర్థిక వ్యవస్ధలో డిమాండ్‌ను ప్రేరేపించేందుకు ప్రభుత్వం మరో ప్యాకేజ్‌ను ప్రకటించాలని ఆయా రంగాల నుంచి ఎదురైన విజ్ఞాపనలతో ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు సాగిస్తోంది. ఉద్దీపన చర్యల కోసం ప్రభుత్వానికి వివిధ మంత్రిత్వ శాఖలు, రంగాల నుంచి పలు సూచనలు, ప్రతిపాదనలు అందాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

మరో ఉద్దీపన ప్యాకేజ్‌ వెలువడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యాక్రమంలో సంకేతాలు పంపారు. జీడీపీ తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని మదింపు చేస్తోందని, మరో ఉద్దీపన ప్యాకేజ్‌కు అవకాశాలు మిగిలే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది భారత్‌ వృద్ధి రేటు 10.3 శాతం పతనమవుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఇక వృద్ధికి ఊతమిస్తూ, డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

చదవండి : రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్‌

Advertisement
 
Advertisement
Advertisement