ప్రపంచ పసిడి రాజధానిగా పిలిచే దుబాయ్లో అక్షయ తృతీయ సందడి మొదలైంది. ఏప్రిల్ 19న రానున్న ఈ శుభదినాన్ని పురస్కరించుకుని, అక్కడి ప్రముఖ జ్యువెలరీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. భారతీయ సమాజానికి ఎంతో ముఖ్యమైన ఈ పండుగ నాడు బంగారం కొనుగోలు చేయడం శ్రేయస్కరమని భావిస్తారు కాబట్టి, కస్టమర్లను ఆకర్షించేందుకు జీరో మేకింగ్ ఛార్జీలు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ వోచర్లతో మార్కెట్ కళకళలాడుతోంది.
ముఖ్యంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్, మీనా జ్యువెలర్స్ వంటి బ్రాండ్లు ప్రత్యేక అక్షయ తృతీయ కలెక్షన్లను పరిచయం చేశాయి. మలబార్ గోల్డ్ వజ్రాల ఆభరణాలపై 40% వరకు తగ్గింపుతో పాటు, పాత బంగారం మార్పిడిపై 'జీరో-లాస్' పథకాన్ని అందిస్తోంది. అలాగే, మీనా జ్యువెలర్స్ వజ్రాలు, పోల్కీ ఆభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణేలను, భారీ కొనుగోళ్లపై గోల్డ్ బార్లను బహుమతిగా ఇస్తోంది.
మరోవైపు, సిరోయా జ్యువెలర్స్ వజ్రాల ఆభరణాలపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్ ప్రకటించగా, అరక్కల్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై 80% వరకు తగ్గింపును ఇస్తోంది. మే 5వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు, కస్టమర్లకు ధరల పరంగా భారీ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున నేరుగా షోరూమ్లను సంప్రదించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అక్షయ తృతీయ సెంటిమెంట్ వల్ల దుబాయ్లోని భారతీయ ప్రవాసుల నుండి మంచి స్పందన లభిస్తుందని రిటైలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయంతోపా దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో, ఈ ఏడాది కూడా విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


