బంగారంపై పెట్టుబడులంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ లోహం రూపంలో పసిడిని కొనడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటివారి కోసం పెట్టుబడి అవకాశంగా ప్రభుత్వం తీసుకొచ్చినదే సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం (SGB). అలా సావరిన్ గోల్డ్ బాండ్స్ 2017–18 సిరీస్ VIలో పెట్టుబడిపెట్టినవారికి ఇప్పుడు మూడు రెట్లకు పైగా లాభం వస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,066 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 317 శాతం లాభం అన్నమాట.
2017 నవంబర్లో గ్రాముకు రూ.2,945 వద్ద జారీ చేసిన బాండ్లు ఇప్పుడు రూ. 9,171 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 31, నవంబర్ 3, 4 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.
ఏమిటీ సావరిన్ గోల్డ్ బాండ్స్?
బంగారం దిగుమతులను తగ్గించడంతోపాటు.. పసిడిపై పెట్టుబడులను డిజిటల్వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.
ఎస్జీబీలకు (Sovereign Gold Bonds) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.
కాగా సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు గత అక్టోబర్లో తుది రిడంప్షన్ను అందుకున్నారు. ఆ సిరీస్ బాండ్లకు ఆర్బీఐ గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. 2017–18 సిరీస్ IV మదుపరులు 8 ఏళ్ల కాలంలో 325 శాతం రాబడిని పొందారు.


