ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు! | Double Decker Train Journeys in India These Are the Routes You Can Take | Sakshi
Sakshi News home page

ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!

Apr 20 2026 6:11 PM | Updated on Apr 20 2026 6:32 PM

Double Decker Train Journeys in India These Are the Routes You Can Take

భారతదేశంలో ట్రైన్ జర్నీ అనేది కేవలం గమ్యస్థానాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే.. దాదాపు అందరూ కూడా సాధారణ రైళ్లలో ప్రయాణం చేసి ఉంటారు. కానీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణం చాలా అరుదు. ఈ రకమైన ట్రైన్ జర్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విశాలమైన కిటికీల (విండోస్) గుండా బయట ప్రపంచాన్ని చూడటం ఆ థ్రిల్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ కథనంలో మన దేశంలోని డబుల్ డెక్కర్ రైలు మార్గాలు ఏవి? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

ముంబై - అహ్మదాబాద్
డబుల్ డెక్కర్ రైలు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ముంబై - అహ్మదాబాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్. ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఇది రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతూ వ్యాపారవేత్తలు, తరచూ ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజులో జర్నీ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సౌకర్యవంతమైన చైర్ కార్ సీటింగ్, పెద్ద కిటికీలు ఉండటం వల్ల మీ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.

ఢిల్లీ - జైపూర్
ఢిల్లీ-జైపూర్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దేశ రాజధాని ఢిల్లీని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌తో కలుపుతుంది. ఈ మార్గంలో ఏడాది పొడవునా పర్యాటకులు, రోజువారీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇందులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు.

చెన్నై - బెంగళూరు
చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ప్రయాణించే రైళ్లలో ఒకటి. ఉద్యోగులు, విద్యార్థులు, వారాంతపు ప్రయాణికులు ఎక్కువగా ఈ రైలును ఉపయోగిస్తారు. పరిమితమైన స్టాప్‌లు, సమర్థవంతమైన షెడ్యూలింగ్ వంటివి ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ రైలుకు అధిక డిమాండ్ ఉండటం వల్ల.. టికెట్లు త్వరగా అమ్ముడవుతాయి.

విశాఖపట్నం - విజయవాడ
విశాఖపట్నం - విజయవాడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ సర్వీసు సాధారణ ప్రయాణికులకు, ఆఫీసులకు వెళ్లేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. విశాఖ పట్టణం, విజయవాడలకు ప్రయాణించాలనుకునే వారికి ఈ డబుల్ డెక్కర్ మంచి ఎంపిక.

హౌరా - ధన్‌బాద్
హౌరా-ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్.. కోల్‌కతాను జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలుపుతూ నడుస్తుంది. దీనిని వ్యాపారులు, ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా.. రోజువారీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

సాధారణ రైళ్లు మాదిరిగా.. డబుల్ డెక్కర్ ట్రైన్స్ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండవు. దీనికి కారణం ప్రత్యేకమైన మౌలిక వసతులు. ఉదాహరణకు.. ప్లాట్‌ఫారమ్ ఎత్తు, ట్రాక్ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల భారతీయ రైల్వేలు అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాలలో మాత్రమే వీటిని ప్రవేశపెట్టాయి.

ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

Advertisement
 
Advertisement
Advertisement