Chinese Firms SIFO Arrest Mastermind From Bihar Know Details - Sakshi
Sakshi News home page

చైనా కంపెనీల మాస్టర్‌ మైండ్‌కు భారీ షాక్‌ : వివరాలివిగో!

Sep 13 2022 10:05 AM | Updated on Sep 13 2022 10:52 AM

Chinese Firms SIFO Arrest Mastermind From Bihar Know Details - Sakshi

న్యూఢిల్లీ: చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) అరెస్టు చేసింది.  దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై  కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  మరో భారీ విజయాన్ని సాధించింది.  ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్‌ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్‌లోని హుసిస్‌ కన్సల్టింగ్, బెంగళూరులోని ఫినిన్టీ లిమిటెడ్, గురుగ్రామ్‌లోని జిలియన్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా కార్యాలయాల్లో సెప్టెంబర్‌ 8న సోదాలు నిర్వహించిన మీదట ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘జిలియన్‌ ఇండియా బోర్డులో డోర్సె సభ్యుడిగా ఉన్నారు. చైనాతో లింకులు ఉన్న అసంఖ్యాక డొల్ల కంపెనీలను భారత్‌లో ఏర్పాటు చేయడం, వాటి బోర్డుల్లో డమ్మీ డైరెక్టర్లను చేర్చడం వెనుక తనే మాస్టర్‌మైండ్‌ అని తేలింది.

రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రికార్డుల ప్రకారం తను హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి ప్రాంత వాస్తవ్యుడిగా డోర్సె నమోదు చేసు కున్నారు. ఢిల్లీ నుంచి బీహార్ రోడ్డుమార్గంలో  విదేశాలకు  పారిపోయే ప్రయత్నాలకు చెక్‌ చెప్పిన ఎంసీఏ బీహార్‌లోని ఒక మారుమూల  ప్రాంతంలో అరెస్ట్‌ చేసింది.  ఎస్‌ఎఫ్‌ఐవో ప్రత్యేక టీమ్‌ సెప్టెంబర్‌ 10న డోర్సెను అరెస్టు చేసి, సంబంధిత కోర్టులో హాజరుపర్చిందని ఎంసీఏ వెల్లడించింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement