భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్, ట్రైబల్ మ్యూజియం ఆదర్శనీయమని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీజీఐఆర్డీ) సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో పీసా చట్టం అమలుపై గురువారం జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్డూలు వంటి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం భద్రగిరి మార్ట్ను నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. ఈ తరహా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. పీసా అధికారి అశోక్, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
సినిమా హాల్
మేనేజర్పై దాడి
భద్రాచలంఅర్బన్: దాడి ఘటనలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన నాగభూషణం ఓ సినిమా హాల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేటకు చెందిన రవి కుమార్ మామూళ్ల కోసం నాగభూషణం వద్దకు వెళ్లాడు. హాల్ యజమానిని అడగాలని సమాధానం ఇవ్వగా రవికుమార్ కోపంతో నాగభూషణంపై చేయిచేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరు యువకులకు
తీవ్ర గాయాలు
జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. వెంగన్నపాలేనికి చెందిన ముగ్గురు యువకులు బైక్పై కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వస్తున్నారు. అదే సమయంలో ఖమ్మం వైపు నుంచి కారు కొత్తగూడెం వెళ్తోంది. ఈ క్రమంలో మాచినేనిపేటతండా గ్రామం వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పూర్ణచందర్, లాజర్లకు అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
రెండు కేజీల గంజాయి స్వాధీనం
పాల్వంచరూరల్: ఇద్దరు విద్యార్థులు, మరో నలుగురు యువకులు రెండు కేజీల గంజాయితో గురువారం పోలీసులకు పట్టుబడ్డారు. రూరల్ ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గురుకుల కళాశాల సమీపంలో ఆరుగురు యువకులు అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు పట్టుకుని విచారించారు. వారి నుంచి రూ.1.7 లక్షల విలువైన రెండు కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగేందుకు ఒడిశా నుంచి తెచ్చినట్లు విచారణలో అంగీకరించారు. నిందితులు, పాల్వంచ పట్టణానికి చెందిన ఇంటర్ చదివిన గడ్డం వికాస్ గాంధీ, ఐటీఐ చేస్తున్న వేల్పుల చరణ్, దారవత్ చరణ్, ఎస్కె.సాకిర్, ఎస్కే యాకూబ్ పాషా, బట్ట నాగేంద్రబాబులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
మట్టి ట్రాక్టర్ ఢీకొని విరిగిన రెండు విద్యుత్ స్తంభాలు
రాత్రి వేళ సీతారామ మట్టి
అక్రమంగా తరలింపు
జూలూరుపాడు: మండలంలోని నల్లబండబోడు సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ మట్టిని గురువారం తెల్లవారుజామున అనంతారం గ్రామానికి కొందరు వ్యక్తులు ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొనగా, రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. డ్రైవర్ దుర్గాప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గాయపడ్డ డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సీతారామ కెనాల్ మట్టిని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.


