పాలకవర్గం గద్దెనెక్కినా అభివృద్ధి శూన్యం మూలుగుతున్న రూ.15 కోట్ల ఇల్లెందు పట్టణ అభివృద్ధి ప్రత్యేక నిధులు
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాల్టీలో ఏడాదిన్నరగా ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. నిధులు ఉన్నా పనులు పనులు జరగడం లేదు. తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేసిన పనులు కూడా ప్రారంభం చేయలేదు. గత పాలకవర్గం పదవీకాలం 2025 జనవరి నెలాఖరుతో ముగిసింది. గత ఏడాదిన్నర కాలంలో ఏ వార్డులోనూ ఒక్క పని పూర్తి చేయలేదు. నాటి నుంచి నేటి వరకు మున్సిపాల్టీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. రూ.కోట్ల రూపాయల నిధులు ఉన్నా వివిధ కారణాలతో వాటిని ప్రారంభించకుండా రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత పాలకవర్గం రెండు నెలల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా మరోమారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం మున్సిపాల్టీలో పర్యటించనున్నారు. ఇప్పటికై నా పాత అభివృద్ధి పనులు పూర్తి చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తారా అని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేడు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, మున్సిపల్ నూతన చైర్మన్ చాంబర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇబ్బడి ముబ్బడిగా నిధులు..
ఇల్లెందు పట్టణాభివృద్ధికి నిధులు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.15 కోట్లు 24వార్డుల్లో 56 పనులు చేపట్టాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఆఘమేఘాల మీద మంత్రి పొంగులేటి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించారు. ఈ పనుల్లో ఒక్కటీ ప్రారంభించలేదు. ఇలా మంత్రితో శంకుస్థాపన చేసిన పనులకే దిక్కు లేకుంటే ఎలా అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.
నేడు మంత్రి పొంగులేటి రాక


