భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. హుండీల్లోని నగదును ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం లెక్కించగా రూ.1,56,91,971 ఆదాయం నమోదైందని ఈఓ దామోదర్రావు తెలిపారు. గత నెలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తడంతో ఈసారి ఆదాయం గణనీయంగా పెరిగింది. నగదుతో పాటు 0.071 గ్రాముల బంగారం, 1.280 కిలోల వెండి, విదేశీ కరెన్సీని సైతం స్వామికి సమర్పించారు.
రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, ఆ తర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
హుండీ ఆదాయం రూ.1.56 కోట్లు


