పాల్వంచరూరల్: ఓ రైతు తన భూమిలో బోరు వేస్తుంటే వైల్డ్లైఫ్ రేంజర్ కవిత మాధురి సిబ్బందితో కలిసి బోరు వేయకుండా అడ్డుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని తీసుకెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. మండలంలోని ప్రభాత్నగర్(రెడ్డిగూడెం) శివారులోని తేజావత్ జ్యోతి, ప్రకాష్ భూమిలో మంగళవారం బోరు వేస్తుండగా సమాచారం అందుకున్న యానంబైల్ రేంజర్ ఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్టు భూమిలో బోరు వేస్తున్నారని ఆరోపిస్తూ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని తీసుకెళ్తుండగా బాధిత రైతు తేజావత్ ప్రకాష్, సుమత్ నరేశ్, సురేశ్, సామ భాగ్యమ్మ, సామ మోహన్రెడ్డి, జక్కుల రాములు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు వాహనాన్ని వదిలేసి వెనుతిరిగి వెళ్లారు. కాగా, ఈ భూమికి రెవెన్యూ పరంగా 1969 నుంచి సిస్తు కట్టిన రశీదులు, 1995 నుంచి పహాణీ నకళ్లు, మీ సేవ నుంచి తీసుకున్న ధరణి పహాణీలు ఉన్నాయని అయినా అటవీశాఖ అధికారులు బోరు వేస్తుంటే అడ్డుకుంటున్నారని బాధిత రైతు వాపోయాడు.


