భక్తులు మెచ్చేలా ‘నవమి’
● అధికారులు సమన్వయంతో పని చేయాలి ● శ్రీరామనవమి ఏర్పాట్ల సమీక్షలో మంత్రి పొంగులేటి ● గైర్హాజరైన ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీస్..
భద్రాచలం: భక్తులు మెచ్చేలా శ్రీసీతారాముల కల్యాణ ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం భద్రాచలంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. నవమి ప్రణాళికల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భద్రాచలం చుట్టు పక్కల ఆర్అండ్బీ రోడ్లకు, చర్ల–వెంకటాపురం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, రెండు బ్రిడ్జిలపై, భద్రాచలంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, బందోబస్తు, సెక్టార్లు, కల్యాణ వేదిక వద్ద జరిగే తోపులాట నియంత్రించేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఫుడ్ పరీక్షలు, లడ్డూ ప్రసాద తనిఖీల అనంతరమే విక్రయాలు జరగాలన్నారు. సీఎం సెక్టార్లో ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా సమీక్ష సమావేశానికి గైర్హాజరైన భద్రాచలం ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. మహబాబూబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ సీఎం సెక్టార్లో జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ వీఐపీ సెక్టార్లలోకి పాస్లు లేకుండా వచ్చే వారిని నియంత్రించాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ రోహిత్ రోజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ట, ఎంవీఐ సంగం వెంకట పుల్లయ్య, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


