పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
నేడు పోలీస్ స్టేషన్లకు చేరనున్న
ప్రశ్నాపత్రాలు
పరీక్ష కేంద్రాల వద్ద
సెక్షన్ 163 బీ అమలు
విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరాలంటున్న అధికారులు
పరీక్ష సమయానికి అనుగుణంగా
ఆర్టీసీ బస్సులు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25న ప్రారంభమ య్యే పరీక్షలు మార్చి 18న ముగియనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,278 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9,407 మంది హాజరు కానున్నారు. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు జిల్లాలో రెండు ఫ్లయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. పరీక్ష పత్రాలను భద్రంగా నిల్వ చేయనుండగా ఆయా కేంద్రాలకు ఆదివారం చేరుకోనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద 163 బీ సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
జిల్లాలో 37 కేంద్రాలు..
ఇంటర్ మీడిఝెట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేయగా, అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తో పాటు ఆయా విభాగాధిపతులను నియమించారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అనుభవజ్ఞులైన ఇన్విజిలేటర్లను నియమించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను అత్యంత జాగ్రత్తగా మూల్యాంకన కేంద్రాలకు పంపించేందుకు పోస్టల్ శాఖ చర్యలు చేపడుతోంది.
విద్యుత్ సరఫరా.. వైద్య సేవలు..
పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో మందులు, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించడంతో పలువురు ఏఎన్ఎంలకు విధులు కేటాయించారు. మున్సిపల్, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు సమకూర్చనున్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు నిమిషం, ఐదు నిమిషాల నిబంధనలు ఏమి లేనప్పటికీ.. విద్యార్థులు ముందుగానే చేరుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఇంటర్మీడియట్ అధికారులు సూచిస్తున్నారు.
ఈనెల 25 నుంచి
ఇంటర్ పరీక్షలు


