గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
చుంచుపల్లి: గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఇటీవల ఎన్నికై న సర్పంచ్లకు ఇస్తున్న శిక్షణ రెండో విడత కార్యక్రమం శనివా రం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచులకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. శిక్షణలో భాగంగా పంచాయతీల పరిపాలన విధానం, గ్రామాభివృద్ధి కార్యాచరణ రూపకల్పన, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించామని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే సర్పంచులు సరైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ వంటివాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఆ తర్వాత శిక్షణ పొందిన సర్పంచ్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సుధీర్కుమార్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్రత్ వలి, ఏపీఓ రంగ, ఎస్బీఎం రేవతి, డీటీఎం సందీప్, అరుణ్కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్


