ఆళ్లపల్లి అడవుల్లో పులి..
● పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ● అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
గుండాల : ఆళ్లపల్లి మండలంలోని అటవీప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆళ్లపల్లి మండల పరిధిలోని చింతోనిగుంపు బీట్ పరిధి లక్ష్మీపురం అడవుల్లో పులి అడుగులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రేంజర్ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వచ్చిన సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించి, రేగళ్ల రేంజ్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అనంతోగు అటవీ ప్రాంతంలో ఉందని అంటున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపర్లు అటుగా వెళ్లొద్దని సూచించారు. పెద్దపులికి ప్రాణ హాని తలపెట్టొద్దని, అదే సమయంలో ఆ ప్రాంతానికి పశువులను మేతకు పంపొద్దని కోరారు. పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. అనంతోగు అడవుల నుంచి పాల్వంచ అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని, వాహనదారులు, ప్రయాణికులు సైతం తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
పులి తిరుగుతోంది.. జాగ్రత్త
పాల్వంచరూరల్: జిల్లా అభయారణ్యంలోకి పులి ప్రవేశించిన విషయం నిజమేనని జిల్లా అటవీశాఖాధికారి జి.కృష్ణాగౌడ్ తెలిపా రు. వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు, పశువుల కాపర్లు ఒంటరిగా కాకుండా సమూమంగా వెళ్లాలని సూచించారు. పులి సంచారం లేదా పాదముద్రలు కనిపిస్తే స్ధానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అటవీ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సిబ్బంది ద్వారా దండోర, చాటింపు చేయించామని పేర్కొన్నారు. అయితే ఈ పులి జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించింది కాదని, మరో కొత్త పులి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.


