తల్లిపాలతోనే ఆరోగ్యం
సూపర్బజార్(కొత్తగూడెం): తల్లిపాలలో అనేక పోషక విలువలు ఉంటాయని, అవే పిల్లల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మదర్ ఫీడింగ్ రూమ్ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం చంటి పిల్లలతో వచ్చే తల్లులకు ఈ గది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనాకు సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం వంటి అంశాలపై తల్లులకు అవగాహన కల్పించాలని, శిశువుకు మొదటి ఆరునెలల పాటు తల్లిపాలు ఇస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.
పోషణ అభియాన్ అద్భుత పథకం
పోషణ అభియాన్ అద్భుత పథకమని ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను పోషణ లోపం, తక్కువ బరువు గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి న్యూట్రిషన్ రీహాబిటేషన్ సెంటర్లకు పంపించాలని, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కిశోర బాలికల కోసం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు క్రింద ‘ఇందిరమ్మ అమృతం‘ పేరుతో 14 – 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్తో కూడిన చిక్కీలు ప్రతీ నెల అందజేస్తామని, తద్వారా రక్తహీనత లోపాల నుంచి బయటపడతారని తెలిపారు. పౌష్టికాహారం నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుంటే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు పెరటి తోట పెంపకాలు నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీడీపీఓలు ప్రసన్నలక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమసత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, హసీనా, భార్గవి, డీసీపీఓ హరికుమారి, సందీప్, సంతోషరూప, రాజమణి, సునీత పాల్గొన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ
ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి


