కొత్తగా గూడెం..
కాంట్రాక్టర్ల పేరుతోనే కాలనీలు
కార్పొరేషన్గా మారాక తొలి ఎన్నికలు..
రుద్రంపూర్: సుమారు 110 ఏళ్ల కిందట ఏర్పాటైన సింగరేణి గనుల ద్వారా కొత్తగూడెం ఏర్పడింది. ఒకప్పడు అటవీ ప్రాంతంతోకూడిన చిన్న, చిన్న గ్రామాల సమూహంగా కొత్తగూడెం ఉండేది. ఇక్కడి ప్రజలు గోదావరి ఉపనదులను ఆధారం చేసుకుని జీవించేవారు.
బ్రిటీష్ కాలంలో మలుపు..
బ్రిటీష్ హయాంలో 1880లో డాక్టర్ విలియం నేతృత్వంలో బొగ్గు గనుల అన్వేషణతో కొత్తగూడెం పేరు తెరపైకి వచ్చింది. 1886లో బొగ్గు తవ్వకాల కారణంగా పట్టణంగా మారింది. ఆ రోజుల్లోనే రైల్వేలైన్, కార్మికవాడలు, ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. నల్లగొండ, ఏపీ, ఇతర ప్రాంతాల నుంచి మార్వాడీలు, వైశ్యులు ఇక్కడ వ్యాపారాన్ని విస్తరించారు. కాగా, సింగరేణి ఏర్పాటు చేసిన 12 భూగర్భ గనుల్లో సుమారు 15, 16 వేల మంది కార్మికులు పనిచేసేవారు. దీంతో కార్మిక సంఘాల ఏర్పాటు, కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనూ ఈ ప్రాంతం కీలక పాత్ర వహించగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.
కాంట్రాక్టర్ల పేర్లతోనే కాలనీలు..
నాడు సింగరేణిలో ఏపనులనైనా కాంట్రాక్టర్ల ద్వారా చేయించేవారు. దీంతో వారి పేర్లపైనే కార్మికవాడలు వెలిశాయి. గోరఖ్పూర్ వారిని నియంత్రించేందుకు సీఆర్పీ వారు రవడంతో సీఆర్పీ క్యాంపు, బర్మాదేశస్తులు రావడంతో బర్మాక్యాంపు.. ఇలా గాజులరాజంబస్తీ, బాబూక్యాంపు, నాగయ్యగడ్డ, వనందాస్గడ్డ, పంజాబ్గడ్డ ఏర్పాటయ్యాయి.
2016లో జిల్లా కేంద్రంగా..
1970లో పాల్వం తాలుకా నుంచి విడివడి.. కొత్త తాలూకాగా ఏర్పడింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక 2016లో భద్రాద్రి కొత్తగూడెంను జిల్లాగా మార్చారు. తొలుత, 1971లో నోటిఫైడ్గా మారిన కొత్తగూడెం సుమారు 24 ఏళ్ల తరువాత 1995లో మున్సిపాలిటీగా మారగా.. మరో 30 ఏళ్ల తరువాత కార్పొరేషన్గా అవతరించింది. నేడు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే, ఒకనాడు ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో యువత వలస బాట పడుతున్నారు. కార్పొరేషన్ అయినప్పటికీ ఆశించినస్థాయిలో అభివృద్ధి లేకపోవడం కూడా వెలితిగా మారింది.
నాడు అటవీ ప్రాంతం..
నేడు పరిశ్రమల కేంద్రం


