రామయ్యకు ముత్తంగి అలంకరణ | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు ముత్తంగి అలంకరణ

Jan 27 2026 8:05 AM | Updated on Jan 27 2026 8:05 AM

రామయ్

రామయ్యకు ముత్తంగి అలంకరణ

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతరామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభా త సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వారాంతపు సెలవులకు తోడు రిపబ్లిక్‌ డే కలిసి రావడంతో భక్తులు, పర్యాటకులతో భద్రగిరి కిటకిట లాడింది. దేవస్థానం కాటేజీలు, ప్రైవేటు లాడ్జీ లు, హోటళ్లు, రెస్టారెంట్లు నిండిపోయాయి. దేవస్థానంలో సైతం భక్తుల రద్దీ నెలకొంది.

కొనసాగుతున్న వాగ్గేయకారోత్సవాలు..

దేవస్థానంలోని చిత్రకూట మండపంలో భక్త రామదాసు వాగ్గేయకారోత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం వింజమూరి సుమన్‌, సముద్రాల కూర్మనాయకి, సాయంత్రం కోదండ రామయ్య, తరుణ్‌కృష్ణ అయ్యంగార్‌, గాదెరామ రత్న సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. కాగా మంగళవారంతో వాగ్గేయకారోత్సవాలు ముగియనున్నాయి.

రామయ్యను దర్శించుకున్న బాలాదిత్య

భద్రాచలంటౌన్‌: శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ప్రముఖ సినీ, టీవీ నటుడు బాలాదిత్య సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

పసుపు సాగుతో

అదనపు ఆదాయం

మంత్రి తుమ్మల వెల్లడి

దమ్మపేట: పామాయిల్‌ తోటల్లో అంతర పంటగా పసుపు సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని గండుగులపల్లిలో గల మంత్రి వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్‌ తోటలో సాగు చేసిన పసుపు దిగుబడి ప్రారంభం కాగా, సోమవారం ఆయన పరిశీలించారు. పంట నాణ్యంగా ఉండడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పామాయిల్‌ సాగు చేసే రైతులు లేత తోటల్లో పసుపు సాగు చేసి లాభాలు ఆర్జించాలని సూచించారు.

జిల్లా కోర్టులో

మువ్వన్నెల రెపరెపలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): గణతంత్ర వేడుకల్లో భాగంగా కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్‌ సరిత, న్యాయమూర్తులు ఎం.రాజేందర్‌, కె.కిరణ్‌, కె.కవిత, ఎ.సుచరిత, బి.రవికుమార్‌, వి.వినయ్‌కుమార్‌, ఏపీపీ పి.వి.డి. లక్ష్మి, కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జి. గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, కె. రమేష్‌, సాధిక్‌ పాషా, పార్వతి పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రోహిత్‌రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా దేశసేవ కోసం పాటుపడాలని కోరారు. పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీలు రెహమాన్‌, మల్లయ్య స్వామి, సత్యనారాయణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు  ముత్తంగి అలంకరణ1
1/2

రామయ్యకు ముత్తంగి అలంకరణ

రామయ్యకు  ముత్తంగి అలంకరణ2
2/2

రామయ్యకు ముత్తంగి అలంకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement