కారంచేడు: యువకుడి మృతితో పండగ పూట మరో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎస్ఐ షేక్ ఖాదర్బాషా కథనం మేరకు.. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్ల ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ద్విచక్రవాహనాలపై చీరాల సమీపంలోని వాడరేవు బీచ్కు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బీచ్లో సరదాగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు. వారిలో ఒకడైన బొజ్జా బాలకోటయ్య (27) తన బైక్పై వెళ్తూ... చీరాల నుంచి షాపూర్ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. బస్సుకు ద్విచక్రవాహనం హ్యాండిల్ తగలడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. బండితోపాటు, బాలకోటయ్య బస్సు కింద పడిపోయాడు. తల మీదుగా బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఆసుపత్రికి పంపించారు.


