కొల్లూరు: పోలీసుల కళ్లెదుటే ఓ యువకుడిపై వేరే గ్రామస్తులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పెసర్లంక, గాజుల్లంక గ్రామాలకు చెందిన యువకులు డీజేలతో తెనాలి నుంచి ఆదివారం రాత్రి స్వస్థలాలకు విగ్రహాలు తీసుకువెళుతున్నారు. పెసర్లంక రామన్నపేటకు చెందిన గౌతమ్కి, అదే గ్రామానికి చెందిన సోమరౌతు హరికి నడుమ గతంలో ఇసుక క్వారీ విషయంలో ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి కొల్లూరు గౌడపాలెం వద్ద వివాదం తలెత్తింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ విషయాన్ని గౌతమ్ గాజుల్లంకలోని తమ వారికి చెప్పాడు. కొల్లూరు జమ్మిచెట్టు ప్రాంతంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. తర్వాత పెసర్లంక అడ్డరోడ్డు వద్దకు చేరుకునే సమయానికి గాజుల్లంకకు చెందిన మోటుపల్లి దుర్గాప్రసాద్పై పెసర్లంకకు చెందిన వ్యక్తులు కర్రలతో విరుచుకుపడ్డారు. సింగం కృష్ణప్రసాద్, జొన్నకూటి దుర్గాశంకర్ (ఏకాంబరం), కోన మోహన్, కోన విక్రమ్లతో పాటు మరికొందరు విచక్షణరహితంగా ఈ దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కు కిందకు దూరి ప్రాణాలను కాపాడుకోగలిగాడు. అడ్డుకునేందుకు వెళ్లిన పలువురిపైనా దాడి చేయడంతో వారు తమ వాహనాలను వదిలి పారిపోయారు. వారి ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. క్షతగాత్రుడిని కొల్లూరు పోలీసులు తమ వాహనంలో కొల్లూరు పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం తెనాలి జీజీహెచ్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిశోర్బాబు తెలిపారు. కొల్లూరులో సోమరౌతు హరిపై ప్రత్యర్థి వర్గం వారు దాడికి పాల్పడ్డారు. హరి ఫిర్యాదు మేరకు గాజుల్లంకకు చెందిన మోటుపల్లి దుర్గాప్రసాద్, సనకా శ్రీను, సనకా సాయి, గౌతమ్, మహేష్, తేజ, నాగరాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. గొడవ సమయంలో నలుగురు పోలీసులు విగ్రహాల తరలింపు సజావుగా సాగేందుకు విధులు నిర్వహిస్తున్నారు. వారి కళ్లెదుటే పెసర్లంకకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడుతున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


