ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన వరి పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. నేల నెర్రెలు ఇచ్చి కనిపిస్తుండటంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మండలంలోని ఈదుపల్లి, నగరం గ్రామాలలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి వరి నాట్లు వేశారు. బోర్లలో నీరు, ఇతరత్రా నీటి ఆధారంగా నాట్లు పూర్తిచేశారు. ఖరీఫ్ సీజన్ అదను దాటుతుందని భావించి ముందుకు సాగారు. కానీ వానలు లేకపోవడం, పంట కాలువలకు నీరు విడుదల కాకపోవడంతో నారు ఎండిపోతోంది. వరుణుడు కరుణించి పంటలను బతికిస్తాడనే ఆశలతో రైతులు ఉన్నారు. దీనికి తోడు ఎండల తీవ్రత పెరగడంతో సాగు చేసిన పంటలకు రోజూ నీటి తడులను అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రైతులు వరినాట్లు వేసేందుకు ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పంట కాల్వలకు నీటిని విడుదల చేసి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
– నగరం


