జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
బాపట్ల: చుక్కల భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. చుక్కల భూములపై ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. 25 అర్జీలపై రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరిపారు. చిన్నగంజాం, మార్టూరు, బాపట్ల, పీవీపాలెం, నిజాంపట్నం మండలాల నుంచి నమోదైన అర్జీలపై ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, భూములకు సంబంధించిన దస్త్రాలు, ఆన్లైన్ ద్వారా వెబ్ల్యాండ్, అడంగళ్లు, రెవెన్యూ దస్త్రాలన్నింటినీ పరిశీలించారు. తదుపరి ఆ భూముల తొలగింపుపై తీసుకున్న నిర్ణయాలను సీసీఎల్ఏకు పంపుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, ఇన్చార్జి డీఆర్ఓ లవన్న, భూమి రికార్డుల శాఖ ఏడీ శేషగిరిరావు, జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు హరికుమార్, నరసింహారావు, శ్రీదేవి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. గురువారం న్యూ వీసీ హాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించిన ప్రతి ఒక్కరికీ నోటీసు జారీ చేసి, వారి వివరణను ఎన్నికల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్, సచివాలయ పరిధిలో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు ఫారం–6, విదేశాల్లో నివసించే భారతీయుల (ఎన్ఆర్ఐ) కోసం ఫారం–6ఏ, మరణించిన, బదిలీ అయిన లేదా అనర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు, అభ్యంతరాల కోసం ఫారం–7, వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్, దివ్యాంగుల కోసం ఫారం–8 వినియోగించాలని అధికారులకు సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు సమర్పించవచ్చని తెలిపారు.


