త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సీఈఓ రాజేంద్రకుమార్ సాబు
తాడేపల్లి రూరల్: యూకో బ్యాంక్ ఇటీవల ప్రకటించిన జూన్ 30, 2026 నాటితో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకారం బ్యాంక్ తన నికర లాభంలో మంచి వృద్ధిని సాధించిందని, ఈమేరకు బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ రాజేంద్రకుమార్ సాబు నుంచి ప్రకటన విడుదలైనట్లు బుధవారం యూకో బ్యాంక్ విజయవాడ జోనల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ. 6,05,083 కోట్లుగా నమోదై, వార్షిక ప్రాతిపదికన 15.53 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. సీఎఎస్ఏ వృద్ధి రూ. 1,16,136 కోట్లుగా నమోదు అయ్యిందని, ఇది వార్షిక ప్రాతిపదికన 12.34 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపారు. రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో అడ్వాన్సులు, రిటైల్ అడ్వాన్సుల్లో కూడా వార్షిక వృద్ధి చెందినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికానికి లాభదాయకత 79.84 శాతం వృద్ధిని కనబరిచి రూ. 2810 కోట్లుగా నమోదు అయ్యిందని, జూన్ 30 నాటికి మూలధన పర్యాప్త నిష్పత్తి 19.03 శాతంగా ఉండగా, మూల ధన నిష్పత్తి 17.44 శాతంగా ఉందని తెలిపారు. ముగిసిన త్రైమాసికానికి నికర లాభం రూ. 656 కోట్లుగా నమోదు అయ్యిందని, గత సంవత్సరంతో పోలిస్తే 8.05 వృద్ధిని నమోదు చేసుకుందన్నారు. ఆస్తులు, అప్పులు ఈ త్రైమాసికానికి రిటైల్ అడ్వాన్సులు రూ. 71,549 కోట్లుగా నమోదు అయ్యాయని, గృహ రుణాలు, వాహన రుణాల పోర్టుపోలియోలో వృద్ధి కారణంగా ఇది. 27.32 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసినట్లు ప్రకటించారు. వ్యవసాయ రుణాలు రూ. 38.952 కోట్లుకు చేరిందని, ఈ త్రైమాసికంలో రూ. 47244 కోట్లు రుణాలు ఎంఎస్ఎంఈకి ఇచ్చినట్లు తెలిపారు. దేశీయ శాఖలు 3421 ఉండగా, హాంగ్కాంగ్, సింగపూర్లలో రెండేసి విదేశీ శాఖలు, ఇరాన్లో 1 ప్రతినిధి కార్యాలయం ఉన్నాయన్నారు. దేశీయ శాఖల్లో 61 శాతం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఆర్థిక సమ్మిళిత కార్యాక్రమాలకు దోహదపడుతున్నాయని సీఈఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బియ్యం ధరలు పెరగకుండా సహకరించాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: జిల్లాలో బియ్యం ధరలు పెరగకుండా సహకరించాలని వ్యాపారస్తులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుదల కనిపిస్తుండటంతో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గత పది రోజులుగా జిల్లాలో సూపర్ ఫైన్ బియ్యం ధర రూ.5 నుంచి 6 వరకు పెరిగిందని, కందిపప్పు, మినప్పప్పులు కూడా రెండు నుంచి మూడు రూపాయలు పెరిగినట్లుగా రోజువారీ ధరల సేకరణలో తెలిసిందన్నారు. ధరల పెరుగుదలపై వ్యాపారస్తులను ఆరా తీశారు. బియ్యం, కందిపప్పు ధరలలో ఇంకా పెరుగుదల కనిపిస్తే జిల్లా యంత్రాంగం స్థానిక హోల్సేల్ వ్యాపారస్తులు, మిల్లర్ల సహకారంతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారులు, మిల్లర్లు సహకారం అందించాలని కోరారు. ఇతర వస్తువుల ధరలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
నాటి నిబద్ధత ఫలమే నేటి వైభవం
ఏఎన్యూ(పెదకాకాని): తల్లి లాంటి విశ్వ విద్యాలయం మనకు, మన కుటుంబాలకు ఎన్నో అవకాశాలు, గుర్తింపు, గౌరవాన్ని అందించిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత వీసీ ఆచార్య కె.వియన్నారావు అన్నారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన పూర్వ బోధన, బోధనేతర సిబ్బంది సత్కార కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. దశాబ్దాల పాటు వర్సిటీ అభ్యున్నతికి సేవలందించిన ఉద్యోగులు, అధ్యాపకులను ఒకే వేదికపై ఘనంగా సత్కరించడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ వీసీ ఆచార్య కె.వియన్నారావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం తర్వాత అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిన విద్యాసంస్థగా ఏఎన్యూ ఎదిగిందన్నారు. నాటి ఉద్యోగుల నిబద్ధతతో కూడిన విధులే నేటి వైభవానికి కారణమన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సరసన నిలుస్తూ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని ఏఎన్యూ నిలబెట్టుకుంటోందన్నారు.


