ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఏలూరు జిల్లాకు చెందిన భక్తులు రూ. 5.32 లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాలను శనివారం కానుకగా సమర్పించారు. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన మేడపాటి వెంకట నాగిరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు 32.500 గ్రాముల బంగారం రూ. 5.32 లక్షలతో మంగళ సూత్రాలను తయారు చేయించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మంగళసూత్రాలను అమ్మవారికి సమర్పించారు. దాతలకు వేద ఆశీర్వచనం అందచేసిన అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. బంగారు మంగళ సూత్రాలను ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


