చీరాల: వేసవి సెలవుల్లో దేశంలో పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ రైళ్ళ ద్వారా నాలుగు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించిందని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా అన్నారు. శనివారం స్థానిక రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్యాకేజి–1లో దివ్య దక్షణ యాత్రలో భాగంగా ఆరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు ఉంటాయని, ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై విజయవాడ, చీరాల, ఒంగోలు, గూడూరు మీదుగా వెళుతుందన్నారు. ప్యాకేజి–2లో జ్యోతిర్లింగ దర్శన యాత్రలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాఽథ్, బీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, ప్యాకేజీ–3లో పూరి, కోణార్క్, బైధ్యనాఽథ్, వారణాశి, అయోధ్య, ప్రయాగరాజ్, ప్యాకేజి–4లో మధుర, విద్రవాన్, శ్రీమాతా వైష్ణోదేవి కట్ర, హరిద్వార్, రిషికేష్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు. పర్యాటకుల కోసం తయారు చేసిన ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో వేసవి సెలవుల్లో యాత్రలు చేయవచ్చన్నారు. ఈ రైలు కేవలం పర్యాటక అవసరాల కోసం రూపొందించిందన్నారు. ప్రయాణికులకు భద్రతతో పాటు టూర్ గైడ్ ఉంటారన్నారు. ట్రైన్ టిక్కెట్లోనే భోజనం, స్థానిక హోటల్లో బస, రోడ్డు రవాణా ఖర్చులు ఉంటాయన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లలో టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చని, వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు.


