
జాతీయ క్రికెట్ జట్టుకు నాగండ్ల యువకుడు
ఇంకొల్లు(చినగంజాం): అంతర్జాతీయ స్థాయిలో నేపాల్లో నిర్వహించనున్న క్రికెట్ పోటీలకు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన గాలి సంతోష్ ఎంపికయ్యాడు. ఇంటర్నేషనల్ ఇండో నేపాల్ టీ 20 చాంపియన్ షిప్ అండర్ 19 విభాగంలో ఎంపిక చేసినట్లు ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్ డవలప్మెంట్ ట్రస్ట్ అసోసియేషన్ ధ్రువీకరణ పత్రాన్ని అధికారికంగా పంపించినట్లు సంతోష్ తెలిపారు. మే 26 నుండి 31 వ తేదీ వరకు ఇండియా జట్టు తరపున పోటీలలో బాట్స్మన్, ఆల్రౌండర్ అయిన సంతోష్ పాల్గొనున్నట్లు తెలిపారు. సంతోష్ ఇంకొల్లు డీసీఎంఆర్ కాలేజీ విద్యనభ్యసిస్తుండగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు నాగండ్ల గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.
నీరసించిపోతున్న
నిమ్మ రైతులు
ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి
తెనాలి: ప్రకృతితో పాటు మార్కెట్ మాయాజాలంతో నిమ్మ రైతులు నీరసించిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో శనివారం నిమ్మతోటలు సాగుచేస్తున్న రైతులు, కౌలు రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత నవంబరు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచు కారణంగా చెట్లకు పూత, కాయ రాలిపోయి దిగుబడి తగ్గిందని పలువురు రైతులు వెల్లడించారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలతో కౌలుకు తీసుకున్నామని రైతులు చెప్పారు. మార్కెట్లో రెండు రోజులు ధర బాగుంటే అయిదురోజులు ధరలు తగ్గిపోతున్నాయని మరికొందరు తెలిపారు. నిమ్మకాయల యార్డులో 10 శాతం కమీషన్, ధర్మం వగైరాలను అరికట్టాల్సిన ఆవశ్యకతను తమ దృష్టికి తీసుకొచ్చినట్టు సాంబిరెడ్డి తెలిపారు. నిమ్మ రైతులు నీరసించిపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.