మదనపల్లె టౌన్ : భర్త, అత్తింటి వారి నుంచి ప్రాణరక్షణ కల్పించాలని బాధితురాలి కుటుంబీకులు గురువారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బి.కొత్తకోట మండలానికి చెందిన ఎస్.సోనియాకు పీటీఎం మండలానికి చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్ తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్లుగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని సోనియా ఆరోపించింది. పెద్దల పంచాయితీల తర్వాత కూడా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని, తాజాగా ట్రిపుల్ తలాక్ నోటీసు పంపి ప్రాణహాని చేస్తామని బెదిరిస్తున్నారని కుటుంబీకులు తెలిపారు. భర్త ఫక్రుద్దీన్, మామ అజ్మత్, అత్త రాబియా, వారి కుటుంబ సభ్యులు ఆరిఫ్ బాషా, అహమ్మద్, షమీమ్, రాబియాలపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరారు.


