మదనపల్లె టౌన్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లె శక్తి టీమ్ కు చెందిన శశికళ కళ ప్రతిభ కనబరిచి ఐదు పతకాలు సాధించింది. అమరావతి సమీపంలోని విఐటీ–ఏపీ యూనివర్సిటీలో గురువారం జరిగిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ –2026 లో కర్నూలు రేంజ్ తరపున బరిలోకి దిగిన శశికళ, పలు విభాగాల్లో రాణించింది. రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం వ్యక్తిగత విభాగాల్లో ఆధిపత్యం చాటింది. హ్యాండ్ రెజ్లింగ్ (ఆర్మ్ రెజ్లింగ్) లో బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. అదే జోష్ తో బాక్సింగ్ రింగ్ లోకి దిగి పంచ్ ల మీద పంచ్ లు కురిపిస్తూ రెండో గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది. మహిళా రెజ్లింగ్ విభాగంలోనూ అద్భుతంగా పోరాడి కాంస్య పతకం (3వ స్థానం) సాధించింది.
జట్టు క్రీడల్లోనూ..
జట్టు క్రీడల్లో కూడా తన జట్టుకు వెన్నుదన్నుగా నిలిచింది. కర్నూలు రేంజ్ మహిళా బాస్కెట్ బాల్ జట్టు రాష్ట్రస్థాయిలో రన్నరప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే మహిళా హ్యాండ్ బాల్ జట్టు 3వ స్థానం సాధించడంలో తనవంతు కషి చేసింది. దీంతో ఒకే మీట్ లో 2 గోల్డ్, 1 సిల్వర్ టీమ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ తో మొత్తం 5 పతకాలు సాధించింది.
జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు శశికళకు అభినందనలు తెలిపారు. ఆమె విజయం జిల్లాలోని ఇతర మహిళా పోలీసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
5 పతకాలు సాధించిన శక్తి టీమ్ శశికళ


