● 35 ఏళ్ల చరిత్ర కలిగిన బీఎంపీ వింగ్ తొలగింపు
● ఉన్న పోస్టులను తిరుపతికి తరలిస్తూ ఉత్తర్వులు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పడిన తర్వాత కొత్త పోస్టులు, కొత్త కార్యాలయాలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అందుకు పూర్తి విరుద్ధం. ఉన్న పోస్టులనే తొలగిస్తూ ఎకై ్సజ్ శాఖ తీసుకున్న నిర్ణయం జిల్లా ప్రజలను, ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.ఎకై ్సజ్ శాఖలో గత 35 సంవత్సరాలుగా సమర్థవంతంగా పనిచేస్తున్న బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ (బీఎంపీ) వింగ్ ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వింగ్ లోని పోస్టులను తిరుపతి జిల్లాలో వారికి ఇష్టం వచ్చిన చోట వాడుకునేలా అనుమతించడం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ బార్డర్ ప్రాంతంలో గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం రవాణా వంటి నేరాలు అధికంగా జరుగుతుంటాయి. వీటిని అరికట్టడంలో బీఎంపీ వింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి కీలక వింగ్ ను తొలగిస్తే జిల్లాలో నేరాలు విచ్చలవిడిగా పెరిగే ప్రమాదం ఉంది. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఉన్న పోస్టులు పోవడం అంటే ఆ శాఖను, జిల్లాను బలహీనపరచడమే అవుతుందని ఉద్యోగ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఎలాంటి స్పెషల్ వింగ్స్ లేకపోవడం గమనార్హమని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించి బీఎంపీ వింగ్ ను కొనసాగించాలని వారు కోరుతున్నారు.


