● 10 ట్రాక్టర్లు, 3 జెసీబీలను వదిలేసిన అధికారులు
● ఇన్ని రోజులు లేని రూల్స్ ఇప్పుడు వచ్చాయా అంటున్న స్థానికులు
చౌడేపల్లె : అనుమతులు లేకుండా చెరువుల్లోని మట్టిని తరలించడానికి వీల్లేదంటూ తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు బుధవారం ఆమినిగుంట చెరువులోకి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ దొరస్వామి, ఆర్ఐ భరత్తో పాటు వీఆర్ఓ, వీఆఽర్ఏలు హడావుడి చేశారు. చెరువులోకి వెళ్లి వాహనాలను అడ్డుకొని 10 ట్రాక్టర్లను, 3 జెసీబీలను స్వాధీనం చేసుకొని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించేందుకు బయలుదేరారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తీరా వాహనాలు కార్యాలయం వద్దకు చేరకముందే దారి మధ్యలో నుంచే మళ్లించేశారు. ఇదంతా తెలిసినా తహసిల్దార్ పార్వతి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో ఇన్నాళ్లు మట్టి దందా సాగినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు నిద్రమెల్కొన్నారేమో, ఇన్నాళ్లు లేని రూల్స్ ఇప్పుడు వచ్చాయా...? మీ కథ చూస్తా అంత నిజాయితీగా రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారా..? అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆధికారులు గప్చుప్ అయ్యారు. చెరువు నుంచి స్వాధీనం చేఽసుకొని తీసుకొచ్చిన వాహనాలను వదిలేశారని సమాచారం. నాయకుడి ఆదేశాలతో అధికారులందరూ నోరెత్తకపోగా మిన్నకుండిపోయారు. అలాంటప్పుడు చెరువులోకి వెళ్లి రెవెన్యూ అధికారులు హడావుడి చేయాల్సిన అవసరమేముందని బహిరంగంగానే చర్చ నడుస్తోంది. అధికారులు నిజాయితీ పని చేస్తే ఇలా ఎందుకు జరుగుతుందని స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. అధికార బలం ఉంటే ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఏమిటని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అనుమతి లేనిదే మట్టి తరలించేందుకు వీల్లేదంటూ తహసీల్దార్ పార్వతి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.


