చక్రాయపేట : కుప్పంకు తాగునీటి కోసం తవ్వుతున్న పైపులైన్ పనులను బుధవారం బీజేపీ నేతలు అడ్డుకున్నారు. రైతుల అనుమతి లేకుండా వారికి పరిహారం చెల్లించకుండా వారి పట్టా భూముల్లో ఎలా పనులు చేస్తారంటూ మండి పడ్డారు. కుప్పంకు తాగునీటి కోసం పైపులైను కోసం తవ్వుతున్న కాలువపై సాక్షిలో ‘కుప్పంకు తాగునీరట.. చట్టాలను ఒప్పుకోరట’ అనే కథనం వెలువడింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ప్రసాద్లు ఆపార్టీ నాయకులు రైతులతో కలసి పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈసందర్భంగా భూసేకరణ చేయకుండా.. రైతులకు తెలియ కుండా దౌర్జన్యంగా పట్టా భూముల్లో ఎలా పైపులైన్ కోసం కాలువ తవ్వుతారని మండి పడ్డారు. అనంతరం వారు తహశీల్దారు విజయకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సుమారు 85 శాతం మేర పనులు పూర్తయి అర్ధాంతరంగా ఆగిపోయిన మండలంలోని కాలేటి వాగు ప్రాజక్టు పనులు పూర్తి చేయక పోవడం దారుణమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పుష్పలత నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు దశరథ రాయల్, సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి వేమారెడ్డి, రామ చంద్రా రెడ్డి, ఉమామహేశ్వరి, రైతులు పాల్గొన్నారు.


