పులిచెర్ల(కల్లూరు) : మండల పరిధి పాపిరెడ్డిగారిపల్లె సమీపంలోని మామిడి తోపులో ఏనుగు మృతి చెందిన సంఘటనను మంగళవారం గుర్తించారు. స్థానికులు చెప్పగా పారెస్టు అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. 12 ఏనుగుల గుంపు రెండు రోజుల క్రితం ఈ ప్రాంతంలోకి వచ్చిందని స్థానికులు తెలిపారు. వాటిలో ఒక ఏనుగు విడిపోయి మామిడి తోపుల్లోకి ప్రవేశించింది. విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దానికి బుధవారం పోస్టుమార్టం చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపు సమీపంలోని మూలమడుగు వంకలోకి వెళ్లినట్లు సమాచారం ఉందని, అక్కడికి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.


