మదనపల్లి టౌన్ : పొలం సరిహద్దు వివాదం నేపథ్యంలో భార్యాభర్తలపై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులకు మదనపల్లి 7వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం జైలు శిక్ష విధించింది. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లి పంచాయతీ కొత్తఉడియం గ్రామానికి చెందిన మేకల కదిరప్ప, సుజాత దంపతులపై 2020 జూలై 19న అదే గ్రామానికి చెందిన ఎం.జయచంద్ర, ఎం.గోపాల్ కొడవలితో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై బి.సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆర్.శ్రీలత నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. మొదటి నిందితుడు ఎం.జయచంద్ర (28)కు ఐదేళ్ల జైలు, రూ.11 వేలు, రెండో నిందితుడు ఎం.గోపాల్ (37)కు ఏడాది జైలు, రూ.9 వేలు జరిమానా విధించారు. తీర్పు అనంతరం ఇద్దరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించారు. శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.


