రెండు రోజుల క్రితం ఆలయ పరిసరాల్లో పెద్దఎత్తున చెట్లు నరికివేయడం, దేవస్థాన భూమిలో రోడ్డు ఏర్పాటు చేసినట్లు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయానికి చెందిన స్థలంలో రహదారి నిర్మాణానికి ఎవరు అనుమతిచ్చారనే విషయం తేలాల్సి ఉందంటున్నారు. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా దేవస్థాన భూమిలో చెట్లను నరికివేసినా, మట్టి తవ్వినా, రహదారి నిర్మించినా అది సాధారణ భూవివాదంగా చూడకూడదని పేర్కొన్నారు. దేవుడి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టపరమైన బాధ్యత ఉన్నందున అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ భూముల వ్యవహారంలో స్థానిక టీడీపీ నేత ప్రభాకర్రెడ్డి, నారాయణ తదితరుల పాత్రపై గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.


