మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 71 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూ వివాదాలు 30, ఆర్థిక వివాదాలు 10, ఘర్షణ, న్యూసెనన్స్ 10, కుటుంబ వివాదాలు 6, ఇతరాలు 5, పరిపాలనా పరమైనవి 3 ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే వాటిని పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలలో కొన్ని..
● తప్పుడు సర్వే నెంబరుతో భూమి విక్రయంపై మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం హరిజనవాడ డోర్ నంబర్ 1లో స్థిర నివాసం ఉంటున్న టి.యస్.చాంద్ బాషా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 1508లోని తన ఇంటిపై మేనత్త ఎస్. అమీనాబీతో మదనపల్లె కోర్టులో 554/2011 కేసు నడుస్తోందన్నారు. ఇదే సమయంలో అమీనాబీ కోర్టును తప్పుదోవపట్టించి సర్వే నంబర్ 355 బషినికొండగా మార్చి, నిమ్మనపల్లె రోడ్డులో నివసించే షేక్ వజీర్ బాషాకు రూ.6,82,000లకు డాక్యుమెంట్ నంబర్ 212023/2024 ద్వారా విక్రయించిందని ఆరోపించారు. వజీర్ బాషా తన భార్య అస్మత్ జాన్ పేరున 23097/2024గా మళ్లీ రిజిస్టర్ చేశాడని, సదరు దస్తావేజులు రద్దు చేసి సర్వే నంబర్ 1508 ప్రకారం న్యాయం చేయాలని కోరారు.
● మదనపల్లె లో మోసం చేసిన స్క్రబ్ఎక్స్ కంపెనీ మోసాలకు తాము బలైపోయామని హైదరాబాద్, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండెం, బి.కొత్తకోట ప్రాంతాలకు చెందిన 120 మంది స్క్రబ్ఎక్స్ బాధిత మహిళలు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
● సంబేపల్లె మండలం, దేపట్ల గుట్టపల్లెకు చెందిన నాగిరెడ్డి సోమవారం ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. సర్వే నెం.82/2లో 1.67సెంట్ల భూమి ఉందని, పక్కనే ఉన్న సర్వే నెం.82/1లోని వారు తన పొలాన్ని ఆక్రమించి, బోరు వేస్తున్నారని ఆరోపించారు. లేకపోతే తన పొలాన్ని రిజిస్ట్రార్ ఉందని బోరు వేయామని బెదిరిస్తున్నారని, కబ్జాదారులను అడ్డుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. సంబేపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొన్నారు
అంకితభావంతో ప్రజలకు సేవచేయడం వరం
మదనపల్లె టౌన్ : అంకితభావంతో 30 ఏళ్లు ప్రజలకు సేవచేయడం వరమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. సత్కారం పొందిన వారిలో హెడ్ క్వార్టర్స్ ఆర్ఎస్ఐ ఎస్.అల్లావుద్దీన్, సుండుపల్లె ఏఎస్ఐ ఎస్.వెంకటేశ్వర్లు, పీలేరు ఏఎస్ఐ జె.మల్లిఖార్జున ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకితభావంతో, నిబద్ధతతో వారు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటాద్రి, ఎస్బి సీఐ యు.సదాశివయ్య, ఆర్ఐలు ఎం.రవికుమార్, కె.సురేష్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


