చౌడేపల్లె : మండలంలోని స్వయం సహాయక మహిళా సంఘాల్లో అవినీతిఅక్రమాలపై ’సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ పిడి నాగేశ్వరరావు స్పందించారు. పరికిదొన గ్రామంలోని గంగోత్రి మహిళా సంఘం సభ్యులను కలిసి అధికారుల విచారణ ప్రారంభం కావడంతో సోమవారం రూ:50 వేలు సొమ్ము గ్రామ సమాఖ్య ఖాతాకు జమ అయింది. మొత్తం రూ:1.50 లక్షల రుణం ఆ సంఘం లీడర్లు, సభ్యులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో ఓ మహిళ వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు సొమ్ము బదిలీ అయిన విషయం వెలుగులోకి రావడంతో సభ్యులు అధికారులను నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ‘సాక్షి’లో రుణానికి అంత...ఇవ్వాల్సిందే అడిగినంత..?ఫోర్జరీ సంతకాలతో రుణాలు? శీర్షికతో కథనాలు ప్రచురితమైయ్యాయి. స్పందించిన వెలుగు శాఖ అధికారులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రికార్డులతో హాజరు కావాలని ఆదేశించారు. ఏపీఎం సుబ్రమణ్యం, సీసీ సుగుణలతోపాటు సంఘ సభ్యులు హాజరయ్యారు. సంఘమిత్ర గైర్హాజరైయ్యారు.సంఘం రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని , పర్యవేక్షణ కొరవడడంతోనే సమస్యలు ఎదురువుతున్నాయని హెచ్చరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. లీడర్ల ఫోర్జరీ సంతకాలతో డ్రాచేసిన రూ:1:50 లక్షల సొమ్ములో గ్రామసమాఖ్య బ్యాంకు ఖాతాకు రూ:50 వేలు జమ చేయడం గమనార్హం. మిగిలిన లక్షను నిర్ణీత గడువులోపు క్రమం తప్పకుండా చెల్లించాలని అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు మండలంలో తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరుతున్నారు.


