పెద్దతిప్పసముద్రం: మండలంలోని రంగసముద్రం హైస్కూల్లో తాగునీటి ఎద్దడి కారణంగా విధ్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై ఆదివారం ‘సాక్షి’ లో వెలువడిన ‘మినీ ఫిల్టర్–మెగా నిర్లక్ష్యం’ కథనంపై జిల్లా విధ్యాశాఖ అధికారి డాక్టర్ కే.సుబ్రమణ్యం స్పందించారు. వాస్తవ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంఈఓ నారాయణను ఆదేశించారు.ఆ హైస్కూల్లో దాతలు సమకూర్చిన వాటర్ ఫిల్టర్ మరమ్మతులకు గురైన విషయం వాస్తవమేనని, అయితే వాటర్ ఫిల్టర్కు వారంటీ ఉందని వారం రోజుల్లోగా ఏజెన్సీ వారు వచ్చి మరమ్మతులు చేపడతారని డీఈఓకు వివరించారు. తాత్కాలికంగా తాగునీటి ఇబ్బంది కలగకుండా పాఠశాల నిథులతో పిల్లల సౌకర్యార్థం వాటర్ క్యాన్లను సమకూర్చామన్నారు. ఫిల్టర్కు మరమత్తులు చేయించి త్వరలోనే నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపుతామని ఎంఈఓతో పాటు హెచ్ఎం సరస్వతి డీఈఓకు నివేదిక పంపారు.
దాడిలో గాయపడిన
వ్యక్తి మృతి
చెన్నూరు(వల్లూరు): చెన్నూరులో పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి చేసిన దాడిలో గాయపడ్డ మహబూబ్ వలీ(40) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు చెన్నూరులోని ఓ టీ బంకులో సుమారు రెండు సంవత్సరాలుగా ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి పని చేసేవాడు. ఇతడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న స్థానికుడైన మహబూబ్ వలీపై చెన్నూరులోని కొండపేటకు వెళ్లే బ్రిడ్జి కింద గురువారం ఆకస్మికంగా బండ రాయితో దాడి చేశాడు. ఈ దాడిలో మహబూబ్ వలీ తలకు తీవ్ర గాయాలయ్యాయి, గమనించిన స్థానికులు చికిత్స కోసం క్షతగాత్రుని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు.అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం వైద్యుల సూచనల మేరకు తిరుపతి రుయాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బంధువులు ఇంటికి తీసుకుని రాగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైతు కష్టాలనుపట్టించుకోని ‘కూటమి’
బ్రహ్మంగారిమఠం: రైతులకు కావాల్సిన నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరి ప్రసాద్రెడ్డి తెలిపారు. ఆదివారం బ్రహ్మంసాగర్ను వైఎస్సార్సీపీ మండల రైతు సంఘం అధ్యక్షుడు అన్నపురెడ్డి నారాయణరెడ్డి తో కలసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలంలో రైతులకు కావాల్సిన నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం తాగునీటి సాకుతో నీరు విడుదలచేయడంలేదన్నారు. ఖరీఫ్ పంటకు నీరు వస్తుందని ఆశించిన రైతలకు నిరాశ మిగిలిందన్నారు. ఇప్పటికే జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు రైతుల పక్షాన పోతిరెడ్డిపాడు ను పరిశీలించినట్లు చెప్పారు.అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. బ్రహ్మంసాగర్లో ప్రస్తుతం 7 టీఎంసీ మాత్రమే నీరు ఉందన్నారు. అనంతరం బ్రహ్మంగారిని దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం విద్యార్థిసంఘం అధ్యక్షుడు బి.బాలకృష్ణారెడ్డి, జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రశాత్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎత్తపు సుబ్బారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్, గ్రామ పంచాయతీల పార్టీ అధ్యక్షులు పుల్లలచెరువు రమేష్రెడ్డి, అబ్బిరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, వేమిరెడ్డి నరసింహరెడ్డి, మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


