మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా పోలీసుల కథనం మేరకు.. కొత్తవారిపల్లె పంచాయతీ దొబ్బిగానిపల్లికి చెందిన నాగరాజు, ఆయన కుమార్తె సుశీల ద్విచక్ర వాహనంలో సొంత పనిమీద మదనపల్లెకు వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా తట్టివారిపల్లి సమీపంలోని చెరువు కట్టపై బొలెరో వాహనం బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు, సుశీల తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సుశీలను జిల్లా ఆసుపత్రిలోనే చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
బైకు అదుపుతప్పి కిందపడి..
మదనపల్లె టౌన్: బైకు అదుపుతప్పి కిందపడటంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం పెద్దతిప్పసముద్రం మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీటీఎం మండలం కానుగమాకులపల్లెకు చెందిన రెడ్డప్ప కుమారుడు గణేష్ బైకుపై పీటీఎంకు బయలుదేరాడు. చెరువు మరవ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైకు అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై పేటీఎం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


