దువ్వూరు : మైదుకూరు నుంచి ఆళ్లగడ్డకు వెళ్లే ఆర్టీసీ దువ్వూరు మండల కేంద్రంలో ప్రయాణికులను ఎక్కించుకుని చాగలమర్రి వైపు వెళుతోంది. దువ్వూరు సమీపంలోని దేవాన్ష్, సీవీవీ కల్యాణ మండపాల వద్దకు రాగానే అక్కడ పెళ్లి వేడుకల్లో భాగంగా రోడ్డుపైన బాణసంచా ఒక్క సారిగా పేల్చారు. బాణసంచా పేల్చడంతో బైపాస్ నుండి దువ్వూరులోకి వెళుతున్న ద్విచక్ర వాహనదారులు భయపడి బైకులను కుడి వైపు తిప్పడంతో, ఎదురుగా వస్తున్న బస్సు డ్రైవర్ ద్విచక్రవాహనాదారులను తప్పించే ప్రయత్నంలో రోడ్డుకు ఎడమవైపు తిప్పాడు. ఈ క్రమంలో అప్పటికే రోడ్డు పక్కన తీసిన డ్రైనేజీ కాలువలో బస్సు ఒక వైపు వాలిపోయింది. ద్విచక్రవాహనదారులు రోడ్డుపైన పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ సమయ స్ఫూర్తితో రోడ్డు పక్కకు బస్సు తిప్పడంతో డ్రైనేజీ కాలువకు తీసిన గుంతలో బస్సు చక్రాలు దిగాయి. ఈ ప్రమాద సమయంలో 60 మంది దాకా ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఏమీ కాకపోవడంవతో బస్సు డ్రైవర్, కండక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా ఉన్న కల్యాణ మండపాల వద్ద పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల రోడ్డు పక్కనే ఎక్కడంటే అక్కడ అడ్డంగా పెళ్లికి వచ్చిన వాహనాలను నిలిపేస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో విచ్చల విడిగా బాణసంచా కాల్చడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. . అధికారులు స్పందించి కల్యాణ మండపాలు వద్ద ట్రాఫిక్ను నియంత్రించి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


