చక్రాయపేట : గండి క్షేత్రం శ్రావణ మాస ఉత్సవాల శోభ సంతరించకుంది. వేడుకల్లో భాగంగా నేడు మూడో శనివారోత్సవం జరుగనుంది. ఉదయం 3 గంటలకే సుప్రభాత సేవ, ఉత్సవ మూర్తులకు అభిషేకం(ఏకాంతం), అలంకరణ, ఆరాధన, 5 గంటలకు మహామంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన వసతి కల్పించడం జరుగుతుందని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు తెలిపారు. మొదటి రెండు శనివారాల కంటే ఈ వారం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో.. వారికి సరిపడా లడ్డూ, పులిహోర, ప్రసాదాలను సిద్ధం చేశామని ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి తెలిపారు. రాత్రి బస చేసే భక్తుల కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాతలచే అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రికే భక్తులు పెద్ద ఎత్తున గండి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు.
పెద్ద ఎత్తున బందోబస్తు
శ్రావణ మాసం మూడవ శనివారోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ శ్రీప్రియ తెలిపారు. పులివెందుల సీఐలు, ఎస్సైలు, పోలీసులు, హోం గార్డులు, మహిళా పోలీసులతో సుమారు 300 మందికి పైగా బందోబస్తులో పాల్గొంటారని వారు తెలిపారు.
వాహనాలకు నో ఎంట్రీ
భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించినట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్సై శ్రీప్రియ తెలిపారు. వేంపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు ఇడుపుల పాయ క్రాస్ వద్ద, రాయచోటి, కదిరి వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దాలమర్రి చెక్ పోస్టు వద్ద ఆపేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలను గండిలోకి అనుమతించబోమని వారు తెలిపారు. అత్యవసర ప్రయాణాలు ఉన్న వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని చెప్పారు. భక్తుల రద్దీని బట్టి సాయంత్రం ఆంక్షలను సడలించడం జరుగుతుందని వివరించారు.
నేడు మూడో శనివారోత్సవం
వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు


