మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పరిధిలోని కట్టుబావి చెరువులో మట్టి అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. గురువారం చెరువు పరిసరాల్లో జేసీబీ, ట్రాక్టర్లతో మట్టిని తవ్వి తరలిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతు కే. నాగరాజు ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో నుంచి మట్టిని తవ్వి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చెరువులో యంత్రాలతో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తుండటంతో చెరువు భద్రతకు, పర్యావరణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులకు పాల్పడుతున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. మండల స్థాయి అధికారులు కట్టుబావి చెరువును పరిశీలించి, మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువుల నుంచి జరుగుతున్న మట్టి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు.


