మదనపల్లె టౌన్ : కోడి పందెం కేసులో తొమ్మిది మంది నిందితులకు మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 7 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. బి కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ క్రైం నెం.120/2026, సెక్షన్ 9(2) ఏపీ గేమింగ్ యాక్ట్ కింద ఆగస్టు 11న బయప్పగారిపల్లె గ్రామం.. ఆవుల వంకపల్లె వద్ద పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.21,600 నగదు, 3 కోడి పుంజులు, 6 సెల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో గురువారం క్రైం నెం.2081/2026 కింద కోర్టులో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.శిక్ష పడిన వారిలో ఆవుల వంకపల్లికి చెందిన పుటేరి కుల్లాయప్ప, వేపురకోటకు చెందిన గుడ్లపల్లి చిన్నపరెడ్డి, గట్టుకు చెందిన శ్రీలింగం రెడ్డప్ప, శ్యాంసుందర్, రఘు, గంగాధర, శివ, హరినాథ్ రెడ్డి, బి.కొత్తకోటకు చెందిన గడిబండ శంకర్ ఉన్నారు. ఇకపై కోడి పందాలు, జూదం ఆడేవారికి కఠిన శిక్షలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.


