మదనపల్లె సిటీ : ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రయోజనం లేని స్పెషల్ టెట్ విధానాన్ని నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లెలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జాబీర్ మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రాయితీలు లేని అర్హత మార్కులతో, ఆన్లైన్ విధానంతో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ వల్ల ప్రయోజనం లేదని ఆరోపించారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులతో,ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా పాత విధానాన్నే కొనసాగిస్తూ స్పెషల్ టెట్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేయడం సహేతుకమైన చర్య కాదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 3వతేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.హేమలత, నాయకులు రవిప్రకాష్, విజయకుమార్, పురం రమణ, సహదేవయ్య, శ్రీనివాసులు, సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.


