మదనపల్లె టౌన్ : మదనపల్లె – బెంగళూరు రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు రాజశేఖర్ (22) బైక్పై ఇంటికి వెళుతుండగా, చీకలబయలు జోలపేటకు చెందిన వెంకటరమణ కుమారుడు కుశల్ (30) బుల్లెట్ బైక్పై మదనపల్లెకు వస్తున్నాడు. నక్కలదిన్నె ఆర్చి వద్ద వీరిద్దరి బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రాజశేఖర్ (22) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన బుల్లెట్ బైకర్ కుశల్ను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్ బయలుదేరేటప్పుడు ఒక్క క్షణం ఆగి ఉంటే ప్రమాదం తప్పి ఇల్లు చేరేవాడని, అంతలోనే మృత్యువు కబళించిందని తల్లిదండ్రులు రోదించడం చూపరులను కలచివేసింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.


