మదనపల్లె టౌన్ : పోలీసులకు వృత్తిలో అంకితభావమే నిరంతర ప్రేరణ అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. దశాబ్దాల పాటు క్రమశిక్షణ, అంకిత భావంతో పోలీస్ శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులు ఆదర్శనీయులని పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జూన్ నెలలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు జె.ఎన్.ఎ. బాషా (మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్), పి.మోసెస్ (మొలకలచెరువు పోలీస్ స్టేషన్), హెడ్ కానిస్టేబుల్ కె.మదనమోహన్రెడ్డి (కలికిరి పోలీస్ స్టేషన్)లకు ఎస్పీ ఘనంగా సన్మానం చేసి, జ్ఞాపికలు అందజేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, కుటుంబానికి దూరంగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణలో వీరు అందించిన సేవలు వెలకట్ట లేనివని కొనియాడారు. 1984లో పోలీస్ శాఖలో చేరిన, ఈ ముగ్గురు సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పని చేస్తూ.. నాటి పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటూ వీరు నిర్వర్తించిన విధులు నేటి పోలీసులకు మార్గదర్శకమని చెప్పారు. పదవీ విరమణ పొందినా ఎల్లప్పుడూ పోలీస్ కుటుంబ సభ్యులేనని, ఏ సమస్య ఎదురైనా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ పి.శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ ఏ.ఆదినారాయణ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.సురేష్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసులు, ఆర్ఎస్ఐ ఎం.చంద్రశేఖర్ ఇతర అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


