సాక్షి, మదనపల్లె : మల్లయ్య కొండల్లో మైనింగ్ జరగదు అంటూ చంద్రబాబు, లోకేష్ మాటగా టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్న ఉత్తుత్తి మాటలు పక్కనబెట్టి, తక్షణమే మైనింగ్ జీవోలను రద్దు చేయించాలని వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, నేతలు దేవరింటి రామకృష్ణారెడ్డి (పెదబాబు), దేవరింటి రవిశేఖర్ రెడ్డి (చినబాబు) డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడారు. కూటమి పాలనలో సాధుకొండ, శివపురం.. ఎర్రకొండల్లో మైనింగ్ కోసం టెండర్లు నిర్వహించి, కాంపోజిట్ లైసెన్సులు జారీ చేసిన వాస్తవాన్ని దాచిపెట్టి ప్రతిపక్షంపై నిందలు వేయడం దుర్మార్గమన్నారు. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భక్తుల మనోభావాల కోసం ఎర్రకొండ మైనింగ్ చర్యలు నిలిపివేస్తే, ఈ ప్రభుత్వం వారం క్రితమే మళ్లీ జీవో ఇచ్చిందని మండిపడ్డారు. మైనింగ్ వల్ల తంబళ్లపల్లి ప్రాంతం ఎడారిగా మారి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల మాటలు కాకుండా, చంద్రబాబు చేత జీవోలు రద్దు చేయించి ఆ ప్రతులను మల్లయ్య కొండ ఆలయానికి తెచ్చి భక్తులకు క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులో మైనింగ్ ముప్పు లేకుండా మల్లయ్య కొండల సముదాయాన్ని ’నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాలువపల్లె మధుసూదన్ రెడ్డి, వి.ఎస్.రెడ్డి, బయ్యారెడ్డి, శ్రీనివాసులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ధ్వజం


