సాక్షి, మదనపల్లె : ఎల్నినో ప్రభావంపైజిల్లాలో వ్యవసాయ, అనుబంధ శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, ఫిషరీస్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున కరువు నివారణ, ఉపశమన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని సూచించారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) అమలు లక్ష్యంగా పెట్టుకుని రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విత్తన పెల్లైటెజేషన్ కార్యక్రమాన్ని 400 ఎకరాల్లో అమలు చేసి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామస్థాయిలో విస్తరించేందుకు రైతులకు అవగాహన కలిగించాలన్నారు. మామిడి పంటకు ప్రకటించిన కనీస మద్దతు ధర అమలుతో పాటు మార్కెట్కు వస్తున్న దిగుబడులపై పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ, డీపీఎం వెంకట్ మోహన్, ఏపీఎంఐపీ ప్రసన్న లక్ష్మి, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా అధికారులకు కలెక్టర్ సూచనలు


