మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
రొంపిచెర్ల: మత్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఇస్తామని..ఈ ఆవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా మత్యశాఖ అధికారి పుల్లయ్య కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్వేటినగరం, పలమనేరు ప్రాంతాల్లో చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేలంపాటలో చెరువులను దక్కించుకున్న వారు చేపలను పెంచుకోవచ్చున్నారు. మత్యకారులకు చెరువులను కేటాయిస్తామని తెలిపారు. మత్యకారులు ముందుకు రాకపోతే గ్రామ పంచాయతీలకు అప్పగించి వేలం పాటలు నిర్వహిస్తామని వెల్లడించారు. వేలం పాటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇరిగేషన్శాఖకు 50 శాతం, గ్రామ పంచాయతీలకు 30 శాతం ఇస్తామని వివరించారు.
గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ.. చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈసందర్భంగా భక్తుల ఆలయంలో అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. హిందువులతో పాటు ముస్లింలు సైతం పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం విశేషం.
కడప కోటిరెడ్డి సర్కిల్: మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో కడప పాత బస్టాండ్ నుంచి సోమ వారం పొలతలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు కడప డిపో మేనేజర్ కన్యాకుమారి తెలిపారు. కడప పాత బస్టాండ్ నుంచి ఉదయం 6.30, 9 గంటలకు, 11.30, 2.15, 4.45 గంటలకు ఈ ప్రత్యేక బస్సులు బయల్దేరుతాయ న్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
మదనపల్లె: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
మదనపల్లెలో డయల్ యువర్ ఎస్ఈ
డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సర్కిల్ స్థాయిలో సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు జరుగుతుందని ఎస్ఈ సోమశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను 9440817449 నంబర్కు ఫోన్ చేసి తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందాలని కోరారు.
కడప సెవెన్రోడ్స్: కడప నగరంలోని మరియాపురంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న లూర్దుమాత మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు నవదిన పూజా ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఏడవ రోజు స్థానిక మరియాపురం నుంచి గురువులుగా అభిషిక్తులైన ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి పూజను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాదర్ స్వర్ణ బెర్నార్డ్ దివ్యబలిపూజను సమర్పించగా, వల్లూరు విచారణ ఫాదర్ శరత్ దైవ సందేశమిచ్చారు.సాతానుతో సహవాసం నరకానికి మూలమని, ఏసుక్రీస్తు సువార్త సందేశం రక్షణ మార్గమని అన్నారు. దేవుని తల్లి అయిన మరియమాత సన్నిధిలో విశ్వాసం తో వేడుకుంటే మనకున్న అన్ని సమస్యలు సమసిపో తాయని చెప్పారు. సెయింట్ మేరీస్ కెథిడ్రల్ విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, ఫాదర్లు హృదయ రాజు, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు


