చెయ్యేరులో..ఇసుక దందా !
నాణ్యమైన ఇసుకకు నిలయమైన చెయ్యేరులో ఇసుక దందా కొనసాగుతోంది. రీచ్కు అత్యంత సమీపంలో ఉన్న టంగుటూరు, కోమంతరాజుపురం ఇసుక క్వారీలు అధికారికమే అయినప్పటికీ ఇసుక తోడివేత కూటమి నేతల ఇష్టారాజ్యంగా మారింది. టిప్పర్ల ద్వారా ప్యాకేజీలు మాట్లాడుకొని ఎగుమతి చేస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునే అధికారులు ఏమీ చేయలేని పరిస్ధితి.
రాజంపేట : టంగుటూరు, కోమంతరాజుపురం క్వారీలను అధికార పార్టీ అనుమాయులు టెండర్లో దక్కించుకున్నారు. రైల్వేకోడూరు అనధికారిక ఎమ్మెల్యేగా ప్రాచుర్యంలో ఉన్న నేత అనుచరుడికి కోమంతరాజుపురం క్వారీని కట్టబెట్టారు. టంగుటూరు క్వారీని రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి బంధువు, మంగళగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తికి టంగుటూరు క్వారీ కట్టబెట్టారు. అయితే అంతా తమదే రాజ్యం అన్నట్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వ్యాపారం ప్రారంభించి యథేచ్ఛగా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక టీడీపీ, జనసేన నేతలు పెదవివిరుస్తున్నారు. టంగుటూరు, కోమంతరాజుపురంలోని చెయ్యేరు వద్ద రేయింబవళ్లు మిషన్లు పెట్టి మరీ ఇసుక తవ్వి టిప్పర్లతో చైన్నె, బెంగళూరు ప్రాంతాలకు తరలించి కాసులు సంపాదిస్తున్నారు.
చెయ్యేరు ఇసుక నాణ్యమైనది కావడంతో..
నాణ్యమైనది కావడంతో చెయ్యేరు ఇసుకకు భారీ డిమాండ్ ఉంది. భవన నిర్మాణ రంగంలో స్లాబ్తోపాటు పూతలు, తదితర వాటికి ఈ ఇసుక బాగా పనికివస్తోంది. స్వచ్చమైన ఇసుక వుండడంతో చైన్నె, బెంగళూరు వాసులు ఈ ఇసుక ఎక్కువగా అడుగుతున్నారు. ఇదే ఆసరాగా టీడీపీ వర్గీయులు, మరింతమంది కొన్ని వ్యవస్థలను అడ్డంపెట్టుకొని రోజూ అక్రమంగా టిప్పర్ల ద్వారా ప్యాకేజీలు మాట్లాడుకొని ఎగుమతి చేస్తున్నారనే విమర్శలున్నాయి. కూటమి నేతల అండ ఉండడంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే అన్ని శాఖల అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి.
వెంటాడుతున్న భూగర్భ జల సమస్య
చెయ్యేరులో నీటి ప్రవాహం లేకపోవడంతో ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటి పోతాయని రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గంలోని చెయ్యేరు నదీపరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని, తవ్వకాలు తారస్ధాయికి చేరుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు. అడ్డగోలు ఇసుక తరలింపుపై మైన్స్, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. క్వారీలు దక్కించుకున్న వారు ఏవిధంగా ఇసుక డంపింగ్కు తీసుకొస్తున్నారు? ఏ విధంగా తవ్వుతున్నారన్నదే క్షేత్ర స్ధాయిలో మైన్స్ అధికారులు తనిఖీలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే నిబంధనలకు విరుద్ధంగా జరిగే తవ్వకాలు ఆపాలని కోరుతున్నారు.
యేటిలో జేసీబీలతో
ఇసుక తోడివేస్తున్న తమ్ముళ్లు
నిత్యం టిప్పర్లతో
చైన్నె, బెంగళూరుకు తరలింపు
భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతుల ఆందోళన
చెయ్యేరులో..ఇసుక దందా !


