సాక్షి, తిరుపతి: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అరాచకాలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత అని అన్నారు. తిరుమలలో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా అని భూమన చెప్పుకొచ్చారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మం ముసుగులో కొందరు నా ఇంటి ముట్టడికి వచ్చారు. ఒబెరాయ్ హోటల్కు స్థలం ఇస్తే సాధవులు ఎందుకు ఖండించలేదు. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత. బీఆర్ నాయుడు నీ బెదిరింపులకు నేను భయపడను. దాడులకు భయపడే వాడిని కాదు.. భయపెట్టేవాడిని. తిరుమలతో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా’ అని తెలిపారు.
బీఆర్ నాయుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు. బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు.సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే నా ఇంటి ముట్టడికి కొంత మంది వచ్చారు. సాధు పరిషత్ అధ్యక్షుడు అయినంత మాత్రాన సాధువులు అయిపోరు. బీఆర్ నాయుడు అక్రమాలను నేను ప్రశ్నిస్తున్నానే కారణంగా నాపై కుట్రలు చేస్తున్నారు. బీఆర్ నాయుడు నీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే జగత్ గురువులు, జగత్ కిలాడీలు, టీడీపీ కార్యకర్తలు పసుపు వస్త్రాలు విసర్జించి కాషాయం ధరించి నా ఇంటి ముట్టడికి వచ్చారు. టీడీపీ నాయకుడు నారాయణ రావు సన్యాసులు ముసుగులో ఇంటి ముట్టడికి యత్నించారు. 20 టికెట్లను బ్లాక్లో అమ్ముకునే వ్యక్తి అట్లూరి నారాయణ రావు. సన్యాసి ముసుగులో నా ఇంటి ముట్టడికి సిద్ధపడ్డారు. బీఆర్ నాయుడు తొత్తులుగా వాళ్లంతా నా ఇంటిని ముట్టడికి విఫలయత్నం చేశారు. బీఆర్ నాయుడు.. కాషాయం ముసుగులో ఇలాంటి సన్యాసులను నాపైకి పంపిస్తున్నాడు. బీఆర్ నాయుడు కాదు బీఆర్ కాముడు. ఈ దొంగ స్వామీజీలు కాదు నాకు చెప్పాల్సింది. జగద్గురు కంచి స్వామీజీ, కుర్తాళం పీఠాధిపతి, అహోబిలం పీఠాధిపతిలు చెబితే నేను వింటాను’ అని అన్నారు.


