సాక్షి, తాడేపల్లి: రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం-మోసం నిజం అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.
‘‘మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, పీఎం-కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను.
..2024-25లో పీఎం-కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది.. సున్నా. 2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది.. కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం-కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19,000.
..పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.
రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే.
•మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026
..ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే.
..ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు.
..ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి.
..ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
..మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?. ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబూ మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.


